22 May, 2026 | 2:06 PM

సామాన్యుడికో న్యాయం? కేంద్రమంత్రికి ఇంకో న్యాయమా?

22-05-2026 01:33 PM

బండి భగీరథ్ విషయంలో.. సీఎం, కేంద్రమంత్రి కుమ్మక్కు

పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిందెవరో చెప్పాలి?

హైదరాబాద్: బండి భగీరథ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) కుమ్మక్కయ్యారని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిందితుడు 9 రోజులపాటు పోలీసులకు దొరకకుండా చూసింది ఎవరు?, సామాన్యుడికో న్యాయం? కేంద్ర మంత్రికి ఇంకో న్యాయమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున కేసు నమోదు చేయలేదని పోలీసులు అనడం సిగ్గుచేటు అన్నారు.

పోక్సో కేసు నిందితుడిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ హైకోర్టులో బెయిల్ రావదని తేలిన తర్వాతే అదుపులోకి తీసుకున్నారని వివరించారు. అప్పగించామని.. అరెస్టు చేశామని సీఎం, కేంద్రమంత్రి కలిసి డ్రామాలు ఆడారని ఆరోపించారు. పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిందెవరో చెప్పాలి? అని కేటీఆర్ డిమాండ్ చేశారు. "మేం పోరాడకుంటే.. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేది కాదు. మా పోరాటం, న్యాయవ్యవస్థ వల్లే బాధితులకు న్యాయం జరిగింది" అని వెల్లడించారు.