03-11-2025 10:25:42 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) విచారం వ్యక్తం చేశారు. మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ(RTC MD), రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను అదేశించారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులతో ఆదేశించారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.
పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం, క్షతగాత్రులు, బంధుమిత్రులు, ఇతర కుటుంబ సభ్యుల కోసం కంట్రోల్ రూమ్ లో 9912919545, 9440854433 నంబర్లను ఏర్పాటు చేశారు. బస్సు, లారీ డ్రైవర్లు సహా 21 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులున్నారు. రహదారిపై గుంతను తప్పించబోయి లారీ బస్సును ఢీకొట్టింది. గతేడాది డిసెంబర్ లోనూ మీర్జాగూడకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆలూరు వద్ద టిప్పర్ దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందారు.