calender_icon.png 4 June, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా

02-06-2025 01:20:38 PM

హైదరాబాద్: సకల జనుల ఆకాంక్షలు నెరవేరింది ఈ రోజేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. రాష్ట్ర ప్రజల కలలు నిజం చేసిన సోనియా గాంధీకి(Sonia Gandhi) కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణలో పదేళ్ల ఆధిపత్యం తిరస్కరించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను(Telangana Formation Day) ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground) లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయజెండా ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జాపన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళలు

మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే మా అజెండా అన్నారు. పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళలున్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలకు రూ. 21,000 కోట్లు సున్నా శాతం వడ్డీ రుణాలు ఇచ్చామని వెల్లడించారు. పాఠశాలల నిర్వహణకు మహిళలకే అప్పగించామని పేర్కొన్నారు. మహిళలకు రుణాలిచ్చి బస్సులు కొనుగోలు చేయించామని తెలిపారు. మహిళా సంఘాల బస్సులను ఆర్టీసీకి అద్దెకు తీసుకుని వాళ్లకు ఆదాయం కల్పిస్తున్నా మన్నారు. మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ. 2 లక్షలలోపు రుణాలు మాఫీ చేశామని గుర్తుచేశారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 26 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. బోనస్ పంపిణీ వల్ల రాష్ట్రంలో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రంలో 2.75 లక్షల టన్నుల సన్నధాన్యం వస్తోందన్నారు.

రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూమి వివాదాలు లేకుండా చేసేందుకే భూ భారతి తీసుకువస్తున్నామని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూనే వారి విశ్వాసాన్ని పొందామన్నారు. సివిల్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సూచించారు. గురుకుల విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. రూ. 200 కోట్లతో నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువస్తాం

ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ వసతిగృహం విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని చెప్పారు.

కేంద్ర తీసుకున్న కులగణన నిర్ణయానికి.. తెలంగాణ కులసర్వేనే కారణం

దేశంలో దాదాపు వందేళ్ల క్రితం కులగణన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యతో కేంద్రంలో కూడా కదలిక వచ్చిందన్నారు. వచ్చే జనగణనలో కులగణన కూడా చేర్చుతామని ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయాన్ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయానికి తెలంగాణ కులసర్వేనే కారణం అన్నారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టామన్నారు.

పథకం తొలి ఏడాదిలోనే 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 22.500 కోట్లు కేటాయించామని తెలిపారు. పేదల కోసం దేశంలోనే విప్లవాత్మకమైన మరో సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో మరో నూతన సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పాలసీ డాక్యుమెంట్ రూపకల్పన చేశామని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేందుకు ఫ్యూచర్ సిటీ దోహదం చేస్తుందని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రగతిలో మైలురాయిగా రీజినల్ రింగ్ రోడ్డు

వరంగల్ వంటి నగరాల్లో విమనాశ్రయాల నిర్మాణాన్ని చేపడుతున్నామని, రాష్ట్ర ప్రగతిలో మైలురాయిగా నిలిచే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. గతంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వమే హైదరాబాద్ కు మెట్రోను మంజూరు చేసింది. ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో దేశంలో తొమ్మిదో స్థానానికి పడిపోయిందన్నారు. త్వరలోనే మెట్రో రెండోదశకు అనుమతులు సాధించి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.