31-05-2025 05:20:43 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో గోశాలల(Goshala) ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించి, గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గోసంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని, మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండాలన్నారు. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పరిశీలించి పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ ను ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.