16-06-2025 06:56:15 PM
హైదరాబాద్: గతేడాది తెలంగాణ రైతుల(Telangana Farmers) కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమాన్ని(Rythu Nestham Program) సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గతంలో ఓ పెద్దమనిషి వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాడు చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు. రైతులను వరి వేయొద్దని చెప్పిన పెద్దమనిషి తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారని చెప్పారు. తన ఫామ్ హౌస్ లో పండించిన వరి పంటను క్వింటాల్ కు రూ.4 వేల చొప్పున అమ్ముకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదు, ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని పక్కదారి పట్టిందని, సన్న బియ్యం తినే ప్రజలకు సన్నబియ్యం పంపిణీ(Sanna Biyyam Scheme) చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రానికి సరిపడా సన్నబియ్యం కావాలంటే సన్నవడ్ల సాగును ప్రోత్సహించాలని భావించి, క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తూ సన్నవడ్ల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మన రైతులు పండించిన సన్నవడ్లే సన్నబియ్యంగా పేదల కడుపు నింపుతోందని అభిప్రాయపడ్డారు. వరి దిగుబడిలో ఇవాళ పంజాబ్ ను అధిగమించి తెలంగాణ నంబర్ వన్ గా ఎదిగిందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే సర్పంచ్ ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తను సీఎం అయ్యేనాటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసిపోయిందని గుర్తు చేశారు. గత సీఎం కేసీఆర్ అందినకాడల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేదని పరిస్థితి, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం రైతు కోసం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చేసి చూపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.