04-06-2025 11:23:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): దీర్ఘకాలంగా సీఎంఆర్ ధాన్యాన్ని సమర్పించని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వానికి చెందే సీఎంఆర్ (కస్టమర్ మిల్లింగ్ రైస్) ధాన్యాన్ని దీర్ఘకాలంగా సమర్పించని రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాంటి బకాయిదారులైన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే కొంతమంది మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, వారి ఆస్తులను గుర్తించి బ్లాక్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా బకాయిలు ఉన్న మిల్లర్లను గుర్తించి, వారి ఆస్తులను బ్లాక్ చేయడంతో పాటు, బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సిందిగా సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి మిల్లర్లకు బ్యాంకులు ఎటువంటి రుణాలు మంజూరు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండల స్థాయిలో విత్తనాల దుకాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.