1 నుంచి సీఎం జిల్లాల పర్యటన
- ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఆరు రోజుల పర్యటన
రెండేళ్ల ప్రజాపాలనపై సభలు, సమీక్షలు..
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా సీఎం జిల్లాల పర్యటన చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6 వ తేదీ వరకు ఆరు ఉమ్మడి జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రతి జిల్లాలో ప్రజాసభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రజాసభలు విజయవంతం కావాలన్న ఉద్దేశంతో వేదికలు, రవాణా, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రజాపాలనలో రెండేళ్ల సాధనను ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను తెలియజేయడానికి ఈ సభలు ఉపయోగపడనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పర్యటన ఇలా..
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న వరంగల్ జిల్లా నర్సంపేట, 6న నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు.




