2 April, 2026 | 3:18 AM

గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

02-04-2026 12:00 AM

దమ్మపేట, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెనుక వున్న గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా తిని, నాణ్యత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మెనూ పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడంపై వార్డెన్, వంట సిబ్బందిని మందలించారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, తక్షణమే నాణ్యత గల ఆహారం విద్యార్థులకు అందించాలని, నాణ్యత గల ఆహారం విద్యార్థులకు అందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ రామ్ నరేష్, ఆర్ ఐ బిక్షం, గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల సిబ్బంది, ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తదితరులు వున్నారు.