31-07-2025 12:00:00 AM
సంగారెడ్డి, జూలై 30(విజయక్రాంతి): సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ ను పరిశీలించారు. రోజువారీగా స్టాకు వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈపాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.
రైతులకు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరతలేదని, ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు ఎరువులకు సంబం ధించిన రసీదులను విధిగా తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా తమ స్టాక్ బోర్డును అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ ,మండల వ్యవసాయాధికారులు తదితరులుపాల్గొన్నారు.