03-08-2025 01:16:28 AM
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా రాజ్ భవన్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు అవార్డు ప్రధానం చేశారు. నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టబడింది.
జిల్లా ఈ ఆరు సూచికలలో మూడు సూచికలపై శాతం సంపూర్ణత సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాక, గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి ఆకాంక్షిత బ్లాక్లలో అగ్రస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ అధికారి బృందాలు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం ను అవార్డు కోసం ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఈ అవార్డు రావడం జిల్లాలోని అధికార యంత్రాంగం, మండల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది మరియు ప్రజల చొరవకు గుర్తింపుగా నిలిచింది అని అన్నారు.
ప్రతి గ్రామానికీ అభివృద్ధి కల్పించాలన్న సంకల్పంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి అని, ప్రతి సూచికపై కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ అవార్డు మాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ముందుగానే ప్రణాళికలు రూపొందించి, సమర్థవంతంగా అమలు చేస్తే మరింత ప్రగతి సాధించవచ్చు అన్నారు. భవిష్యత్తులో జిల్లా మరిన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడేలా చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు.