19-01-2026 07:49:16 PM
5 రోజులు నూతన సర్పంచ్ లకు శిక్షణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం పెద్ద కాల్వలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాల పాటు పని చేయాలని, పంచాయతీ పాలనలో వచ్చిన మార్పులను సర్పంచ్ లు అర్థం చేసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ లకు చేరుతాయని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూప కల్పన, పంచాయతీలో పాలన వ్యవహారాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాల సంబంధించి 5 రోజులపాటు సర్పంచ్ లకు శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో వచ్చిన మార్పులను కూడా సర్పంచ్ లు గమనించాలని, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి.
గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్రామంలో నూతన నిర్మాణాలకు, లే ఔట్ లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నియమ నిబంధనలు వంటి అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలలో మంచి ప్రతిభ కనబరిచే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని, సదరు నిధులు మన గ్రామాలకు వచ్చే విధంగా అవసరమైన మార్పులు తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని, గ్రామాలలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ఎంబీ రికార్డులలో నమోదు అయ్యేలా చూడాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధి పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు, బిల్లుల నమోదు, చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ నమోదు చేయడంపై అవగాహన పెంచుకొని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితి అధికారి వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.