08-09-2025 08:07:47 PM
జిల్లావ్యాప్తంగా మూడు చోట్ల స్పీడ్ లేజర్ గన్స్
గత ఏడాది కంటే రోడ్డు ప్రమాదాలు తగ్గించాం
అతి ఎక్కువగా స్పీడు వెళ్లిన వాహనాలకు జరిమానాలు
స్పీడ్ గనులను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి,(విజయక్రాంతి): అతివేగంగా ప్రయాణించే వాహనాలను అరికట్టాలని ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలో మూడు స్పీడు లేజర్ గన్స్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం దగ్గర శివారులోని 44వ జాతీయ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసమే జాతీయ రహదారులపై రెండు చోట్ల, అంతర్ రహదారులపై ఒకచోట స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా చాలనాలు జారీ చేస్తామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగాం అని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ద్వారా మొత్తం 22.9% రోడ్డు ప్రమాదాలు తగ్గుదల అయ్యాయన్నారు.అదేవిధంగా మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3% తగ్గుదల ఉన్నాయన్నారు. అలాగే గాయపడ్డ కేసులు కూడా 181 నుండి 173కి తగ్గగా, గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదైందన్నారు.
ఇది జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచింద న్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు ప్రధాన కారణాలు — ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు, హెల్మెట్ & లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం, అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించడం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, సదాశివనగర్, ఎన్హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు.
జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఇకపై ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (NH-44), జాతీయ రహదారి (NH-161), రాష్ట్ర రహదారులపై ఉండును. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి” అని జిల్లా పోలీసు శాఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్పి వెల్లడించారు.