04-09-2025 04:55:53 PM
రామడుగు (విజయక్రాంతి): రామడుగు మండలం దేశరాజుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. ఏడవ తరగతిలో మ్యాథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ సబ్జెక్టును పిల్లలకు బోధించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మెళకువలతో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయురాలికి సూచించారు. పాఠశాలలోని అన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం చిన్న గదిలో నిర్వహిస్తుండడంతో పాఠశాలలో ఖాళీగా ఉన్న విశాలమైన గదికి తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫామ్, షూ ధరించేలా చూడాలని, క్రమశిక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి ఉన్నారు.
పల్లె దవాఖాన సందర్శన
రామడుగు మండలం దేశరాజుపల్లి "పల్లె దవాఖాన"ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులతో మాట్లాడి పల్లె దవాఖానా సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నూరు శాతం మందికి ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. పల్లెలో బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్న వారి వివరాలు సేకరించి ఉచిత మందులను ప్రతినెలా అందజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా ఉన్నారు.