24-06-2025 01:05:24 AM
నిజామాబాద్ జూన్ 23: (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ఈ అసై న్మెంట్లో భూముల కబ్జా అవకతవకల విషయమై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారిం చారు భాగంగానే ఈరోజు ధర్మపురి హిల్స్ సందర్శించి పలు స్థలాలను డాక్యుమెంట్లను పరిశీలించారు.
ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లబ్ధిదారులే ఉంటున్నారా లేదా.. అని ఆరాతీశారు. లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని అవి అధికారికంగా జారీ చేసినవా లేదా.. అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హరూన్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహశీల్దార్ బాలరాజు, నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావు తదితరులున్నారు.