విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి
ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్
నిర్మల్: ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావా పూర్ కె వద్ద విద్యుత్తు కాంట్రాక్టు పనుల్లో గుత్తెదారు నిర్లక్ష్యం వల్ల స్తంభం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ప్రకాష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసిపిఐయు సంఘం తరఫున మంగళవారం ఖానాపూర్ విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్కు వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ ఒత్తిళ్లకు గురై అభం శుభం తెలియని పనివాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
వీరిని కాంట్రాక్టర్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు అల్లెపు పీటర్, సురేందర్ తెలిపారు. విద్యుత్తు పునరుద్ధరణ పనులలో అమాయకులకు ఎటువంటి ట్రైనింగ్ లేకున్నప్పటికీ ఆ పనులు చేయించడం, దానికి తగు జాగ్రత్తలు చేపట్టకపోవడం, అమాయకులను మృత్యువాత పడే విధంగా చేస్తుందని దాంతోపాటు ఇటీవల ఖానాపూర్ కడంలో కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ,తీగలను సరి చేయడంలో నాసిరకం పనులు చోటుచేసుకున్నాయని, దీనిపై తాము విద్యుత్ శాఖ ఎస్సీ, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.






