19-02-2026 12:00:00 AM
- రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్
మానకొండూర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ప్రారంభించిన పనులన్నింటినీ మార్చి 31 లోగా పూర్తిచేసుకునేలా చూడాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులు సంబురంగా గృహప్రవేశాలు జరుపుకునేలా ఇండ్లను రెడీ చేసి ఇవ్వాలని సూచించారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, కోతి రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎండి గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పెండింగ్లో పెట్టవద్దని పనులు మరింత వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెస్ చాలా బాగుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో పాటు అధికారులను అభినందించారు. బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వారం పదవులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
ఆ తర్వాత కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో ఎండి గౌతమ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ఆర్ అండ్ బి ఈఈ నరసింహ చారి తిమ్మాపూర్ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డితో పాటు హౌసింగ్ అధికారులు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.