నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన
సిద్దిపేట అర్బన్, జూన్ 18: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాకం వల్ల దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఇంతవరకు ప్రధాని మోదీ మాట్లాడకపోవడం సరికాదన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేసి విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నాయకులు అజ్మత్, సంజీవ్, వహబ్తో పాటు భాను, అజ్మత్ అలీ, రవి, నిశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






