20-11-2025 05:20:08 PM
పార్థివదేహాన్ని విద్యార్థుల పరిశోధనా నిమిత్తం హాస్పిటల్ కి అందించిన కుటుంబ సభ్యులు..
నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు సిపిఎం నాయకుడు, గ్రామ మొదటి సర్పంచి కొండకింది శ్రీనివాసరెడ్డి సతీమణి కొండకింది కమలమ్మ(90) గురువారం హైదరాబాదు నివాసంలో మృతి చెందారు. వారి పార్థివదేహానికి సిపిఎం శోభనాద్రిపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కమిటీ సభ్యుడు ఎం.డి రషీద్, శాఖ కార్యదర్శి గోగు లింగస్వామి మాట్లాడుతూ నాటి నిజం నిరంకుశ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని వారు చెప్పారు.
1940 సంవత్సరంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకొని అనేక పోరాటాలకు సారధ్యం వహించి శోభనాద్రిపురం గ్రామానికి మొదటిగా సర్పంచ్ బాధ్యతలు నిర్వహించిన కొండకింది శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ తాను చేసే పోరాటాల్లో భాగస్వామ్యం అయిన కొండకింది కమలమ్మ త్యాగం మరువలేనిది అన్నారు. కడదాకా కమ్యూనిస్టుగా బ్రతికిన నిజాయితీగల నాయకురాలని కొనియాడారు .వారి వారసులను కూడా వామపక్ష భావజాలం వైపు ఉండేలా చూశారని తెలిపారు. కమలమ్మ పార్థివ దేహాన్ని కణనం చేయకుండా బాచుపల్లి మెడికల్ కళాశాలకు విద్యార్థుల పరిశోధనా నిమిత్తం వారి కుటుంబ సభ్యులు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ సీనియర్ నాయకులు ఎండీ లతీఫ్, కొమ్ము అంజయ్య, నర్సింహా, ఎర్ర అంజయ్య, మారయ్య, ఇర్వి రవికుమార్, బీంపాక ప్రశాంత్, బోడిగే వెంకటేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.