సంఘర్షణల సుడిగుండంలో ‘ఎదురీత’
తెలుగు సాహితీ ప్రపంచంలోకి ఆధునిక భావాలతో, అభ్యుదయ కవిత్వంతో దూసుకువచ్చారు కవి గోలి మధు. సామాజికంగా ఏ సమస్య తన దృష్టికి వచ్చినా, క్షణాల్లో ఆ సమస్యపై అలతి అలతి పదాలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఆలోచింపజేసే కవిత రాయగల దిట్ట ఈ కవి. ఆ కవితలు అషామాషీగా కాకుండా స్పష్టమైన దృక్పథంతో ఉంటాయి. మధు ప్రగతిశీల కవిత్వం రాస్తూ తెలుగు సాహిత్యరంగంలో అభ్యుదయ కవిగా పేర్గాంచారు. మధు ఇంతకుముందు ‘భారతీయ ధర్మ విశ్లేషణ’, ‘నవశకం’, ‘రైతు సమరభేరి’, ‘గమనం’, ‘సంఘర్షణ’ అనే ఐదు కవితా సంపుటాలను వెలువరించారు. తన ఆరో కవితా సంపుటి ‘ఎదురీత’. ఈ పుస్తకం గత నెల 12న ఆవిష్కృతమైంది.
చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనప్పటికీ మధు ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు తన కవితల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు. సామాజిక రుగ్మతలపై సూటిగా, పదునైన కవితలు సంధిస్తున్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన మహోద్యమానికి బాసటగా ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి వెలువరించారు. మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవి ఎన్నటికీ వెరవడు. సామాజిక ప్రయోజనం కోసమే ముందుకు వెళ్తాడు. ఆ సంకల్పం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడు. తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తాడు.
అందుకే మధు తన తాజా కవితా సంపుటికి ‘ఎదురీత’ అనే అర్థవంతమైన శీర్షిక పెట్టారు. కవితా సంపుటిలో మొత్తం 55 కవితలున్నాయి. కవిత్వంలో విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. కవితలను ఒక్కసారి చదవడం మొదలుపెడితే, చివరివరకు చదవకుండా ఆపలేం. సజావుగా సాగే జీవితం తలకిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీదేవి తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారమేంటో తెలుస్తుంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ద్యోతకమతుంది.
‘గుడి కప్పులు ధగధగ మెరుస్తుంటే- బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి..’ అంటూ ప్రభుత్వాలు గుడులపై చూపించిన శ్రద్ధ.. బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు కవి. తన పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు కవి రాసిన ఎనిమిది పేజీల కవిత పాఠకులను కంట తడిపెట్టిస్తుంది. ఈ కవితలో పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారికి ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు కవి. ఉన్నట్టుండి ఆ కుక్క మరణించినప్పుడు వారు పడే బాధ కవితలో కనిపిస్తుంది.
జంతు ప్రేమికుల మనసుకు హత్తుకునే విధంగా కవిత ఉంటుంది. ‘మనిషి మనిషికీ మతం మత్తు-.. సందు సందుకీ కులం కిక్కు.. తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి.. -తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం.. పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు.. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి లేనేలేదు. పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు, పోరుబాట చతికిల పడితే- సగటు మనిషి ‘చితి’కే.. మణిపూర్లో తెగుతున్న తలకు- తెగల నడుమ వైరపు అబద్ధం ఆభరణం, ఆర్థిక దాహానికి అధికారం తోడై పైశాచిక విహారం, మారే జెండాలు మార్చే ఎజెండాలు.. వాళ్లిద్దరే ప్రతిసారీ, ప్రశ్న.. ప్రశ్న.. ప్రశ్న.. వికాసానికి తొలి మెట్టు అవగాహనకు పదును పెట్టు,
దారిద్య్ర రేఖలు చెరపాలనే నా ఎదురీత..’ అంటూ కవి పారించిన కవితా ధార మనలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయి. ‘ప్రశ్న సంకెళ్లు తెంచే గండ్రగొడ్డలి.. జాతీయ జెండా నేసినా ‘మానవ’ మానం కాపాడినా,- మగ్గానికి మరణ శాశన మే, ఓట్లు మనవే - పాట్లూ మన వే, సమతా మమతల సంస్థాపనే బౌద్ధం, మొన్న ఓటు -నిన్న ఎనిమిది గంటల పని దినాలు-రేపో ఎల్లుండో ఆదివారానికి దినం, గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే- నువ్వు మాయం నేను మాయం’ అంటూ సాగుతుంది మధు కవిత్వం.






