27 May, 2026 | 4:57 PM

పండిట్ జవహర్‌లాల్ నెహ్రుకు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

27-05-2026 03:30 PM

తంగళ్ళపల్లి, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక భారతదేశానికి పునాది వేసిన మహానేతగా నెహ్రు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నెహ్రు గారి సేవలను స్మరించుకున్నారు.