calender_icon.png 21 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెలపై కాంగ్రెస్ పగ

21-12-2025 01:09:36 AM

ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

  1. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలను పట్టించుకోని వైనం
  2. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు లేక సతమతం 
  3. ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ర్ట దుస్థితికి అద్దం పడుతోంది 
  4. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు 
  5. ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకనే రాష్ర్టంలో యూరియా కష్టాలు
  6. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ‘పల్లెలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగపట్టింది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర కీలక పథకాలను పక్కనపెట్టింది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకే లేఖ రాయడం రాష్ర్ట దుస్థితికి అద్దం పడుతోంది. సర్కారు చేతగాని తనానికి ‘యూరియా యాప్’ ఒక నిదర్శనం.

గత రెండేళ్లుగా రాష్ర్టంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.

రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.

యూరియా యాప్‌తో లైన్లను దాచే కుట్ర

రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. 

ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ ‘మొబైల్ యాప్ నాటకం’ కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ర్టంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కేసీఆర్‌కు రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ‘లైన్లను దాచే’ ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డి మాండ్ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.

ప్రజల సొమ్ముకు కాంగ్రెస్ నేతలు ధర్మకర్తలు మాత్రమే

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఏ ఎమ్మెల్యే లేదా రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని గుర్తు చేశారు.

మనం కేవలం ఆ ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉండి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పల్లెలే పట్టుకొమ్మలనే నినాదంతో గ్రామాలను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా ప్రతినెలా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు. దీనివల్ల తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకున్నాయని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ గ్రామ పంచాయతీ తీర్మానమే కీలకమని, సర్పంచుల సంతకం లేకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రజలను మోసగించడంలో కాంగ్రెస్ అగ్రస్థానం

 రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసినా, కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని, ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ర్ట దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలంగా ఉందని, 67 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా, ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, కర్నె ప్రభాకర్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, నియోజకవర్గ ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.