మల్లన్నసాగర్ నీటితో భువనగిరి, ఆలేరు ప్రజల దాహార్తి తీర్చుతాం
రూ.210 కోట్లతో తాగునీటి పైప్లైన్ నిర్మాణం
పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రూ.210 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ నుంచి భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు తాగునీటిని తరలించే పైప్లైన్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన ఘనపూర్ గుట్ట వద్ద పరిశీలించారు.
పనుల పురోగతిపై సమీక్ష :
ఘనపూర్ గుట్ట వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి పైప్లైన్ నిర్మాణ పనుల పురోగతిని ఎమ్మెల్యేలు సమీక్షించారు. ప్రాజెక్టుకు అవసరమైన 4.5 కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే పొందిందని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ప్రజలకు వీలైనంత త్వరగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రూ.210 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని తరలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నీరు అందుబాటులోకి రావడంతో వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
నాణ్యతతో పనులు పూర్తి చేయాలి:
పైప్లైన్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శిరీషా–కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరథ సీఈ రాంచంద్రనాయక్, ఎస్ఈ వెంకట్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






