14-06-2025 06:39:50 PM
టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య..
మంచిర్యాల (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడేది టీడబ్ల్యూజేఎఫ్ సంఘం మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య(TWJF State General Secretary Basava Punnaiah) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా మూడవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల కనీస సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు కావస్తున్న అక్క్రీడిటేషన్ కార్డులకు ఇంకా స్టిక్కర్లు వేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని, అవి పనిచేయడం లేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు.
ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాగే చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వివరించారు. సంఘ సభ్యులoదరూ కూడా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక...
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) మంచిర్యాల జిల్లా మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా తోట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింది మధుసూదన్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా చుంచు చందు( వార్త), అరికిల్ల జీవన్ బాబు (బీసీఎన్ న్యూస్ ఛానల్), గొర్రె లక్ష్మణ్ (ఎస్ఎల్ఎన్ న్యూస్ ఛానల్), సంయుక్త కార్యదర్శులుగా బుద్దె రవికుమార్ (వార్త), ఇప్ప రాజ్ కుమార్ (శెనార్తి మీడియా), కోశాధికారిగా క్యాతం రాజేష్ (వార్త), జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ముత్యం వెంకటస్వామి (విజయక్రాంతి), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గోపతి సత్తయ్య (వార్త), మేకల ప్రభాకర్ (మన తెలంగాణ), ఆవిడపు వెంకటేష్ (నవతెలంగాణ), సభ్యులుగా ఎం శేఖర్ (శెనార్తి తెలంగాణ), జాడి వెంకటయ్య (నవతెలంగాణ), నేరెళ్ల సంతోష్ గౌడ్ (నేటి ధాత్రి), కే రామాచారి (నవభూమి) సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నూతన కమిటీని శాలువాతో ఘనంగా సన్మానించారు.