గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కల్వకుర్తి ఏప్రిల్ 16: గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని జెపి నగర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిల్వ ఉంచిన బియ్యం, గుడ్లు, కూరగాయలు వంటి ఆహార సరుకులను పరిశీలించారు. తరగతి గదులు, పరిశుభ్రత పరిస్థితులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, బోధన విధానంపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు.
తనిఖీ అనంతరం కలెక్టర్ భోజనశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార నాణ్యత, రుచి, పరిమాణం వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాలల నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు తగిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తాహసిల్దార్ ఇబ్రహీం, పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు వంగూరు మండలంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు అన్ని వసతులతో విద్యా అందించేందుకు పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని గుత్తేదారు పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు .అనంతరం ప్రజాపాలనలో భాగంగా మండల కేంద్రంలో జరిగిన మండల సభలో పాల్గొని మాట్లాడారు.






