19-05-2024 02:11:28 AM
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ ధర్నా చేశారు. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో జీహెచ్ఎంసీ కాంట్రా క్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంగా జీహెచ్ఎంసీ నుంచి కాంట్రాక్టర్లకు రూ. 1350 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నా రు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసంలో ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో దాదాపు రూ. 1400 కోట్లు జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చినప్పటికీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించ డంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. సీఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు బ్యాంకు నుంచి ఇచ్చే రుణాలకు వడ్డీని చెల్లిస్తూ.. మాకెందుకు ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు ఇప్పించి వడ్డీ భారం మోపుతున్నారని జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని నిలదీశారు.
జీహెచ్ఎంసీలో నిధులు ఉన్నప్పటికీ, మా బిల్లులు చెల్లించడంలో అలసత్వం వహించడం సరికాదన్నారు. పెండింగ్ బిల్లుల ఆలస్యానికి నిరసిస్తూ మూకుమ్మడిగా పనులను తక్షణమే నిలిపి వేయాలని కాంట్రా క్టర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా పనులు నిలి పివేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సలహాదారులు రాజేష్, ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్, జాయింట్ సెక్రటరీ వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ తదితరులు పాల్గొన్నారు.