21-06-2025 01:20:20 AM
నకిలీ ఐడీలతో చొరబడిన నలుగురు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్లో అత్యంత సున్నితమైన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్లోకి శుక్రవారం నకిలీ సైనిక గుర్తింపు కార్డులతో నలుగురు ప్రవేశించారు. తిరుమలగిరిలోని టెక్నోచౌక్ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి గుర్తింపు కార్డులను చూపించి లోపలికి ప్రవేశించారు.
అనంతరం ఆర్మీకి చెందిన రహస్య ప్రాంతంలో సామగ్రిని ఫొ టోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడున్న భద్రతా అధికారులు గమనించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
వారు సమర్పించిన గుర్తింపు కార్డులు నకిలీవని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నలుగురిలో సయ్యద్ జమీల్, మహమ్మద్ ముస్తఫా అనే ఇద్దరిని పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన సైనిక అధికారులు, లెఫ్టినెంట్ కల్నల్ ద్వారా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.