21-06-2025 01:22:09 AM
ఆలయ అభివృద్ధికి రూ.కోటి కానుక
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): భాగ్యనగరంలో ప్రసిద్ధి చెంది న బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రి నీతా అంబా నీ భారీ విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల నిమిత్తం రూ. కోటి మొత్తాన్ని గుడి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. గత ఏప్రిల్ నెలలో నీతా అంబానీ తల్లి పూర్ణిమదలాల్, సోదరి మమతా దలా ల్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి గుడి చరిత్ర, విశిష్టతను వివరించారు. ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని ఆలయ అభివృద్ధి కోసం సహకారం అందించాలని వినతి చేశారు. ఈ విషయాన్ని పూర్ణిమ దలాల్ తన కుమార్తె నీతా అంబానీకి తెలియజేశారు. నీతా అం బానీ సానుకూలంగా స్పందించి, కోటి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా ఆలయ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయించారు.
కోటి రూపాయలను ఆలయ బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని ఆలయంలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమానికి వినియోగించాలని నిర్ణయించారు. కాగా, నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పరమ భక్తురాలు. నగరానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతటి ఉదార విరాళాన్ని అందించిన నీతా అంబానీ కుటుంబసభ్యులకు ఆల య నిర్వాహకులు, వేద పండితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.