04-06-2025 12:55:19 AM
న్యూఢిల్లీ, జూన్ 3: భారత్లో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,026గా నమోదైనట్టు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 65 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత 24 గంటల వ్యవధిలో ఐదుగురు మరణించగా.. మృతి చెందిన వారిలో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 37కు పెరిగినట్టయింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 2700గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. గుజరాత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రం లో 59 కేసులు నమోదవ్వగా.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 397కు పెరిగింది.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో అత్యధికంగా 1416 కేసులు ఉండగా.. మహా రాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 372 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో మంగళవారం మరో కేసు నమోదవ్వగా.. మొత్తం సంఖ్య నాలుగుకు చేరింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 28కు పెరిగాయి.
దేశంలో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ తెలిపారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవిగా వర్గీకరించబడలేదని ఆయన స్పష్టం చేశారు. తాము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, కేసుల పెరగడంపై ఆందోళన అవసరం లేదన్నారు.