24-06-2025 01:51:39 AM
న్యూఢిల్లీ, జూన్ 23: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడంటే సమాధానం చెప్పలేం. ఒకపక్క ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తాము ఖమేనీ అంతం కోరుకోవడం లేదని.. కేవలం ఇరాన్లోని అణు కేంద్రాల స్థావరాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అందులో భాగంగా ఆదివారం ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. అయితే కీలక ఆయుధ కేంద్రాలు, వ్యక్తులపై దాడులు, అణ్వాయుధ కేంద్రాల విధ్వంసం మాటున అధికార మార్పిడే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా లక్ష్యం కూడా ఇదే కావొచ్చు. ఇస్లామిక్ విప్లవంతో పెట్రేగిపోతున్న ఖమేనీలను కూలదోస్తేనే యుద్ధం ఆగిపోయేందుకు అవకాశముంది.
గతంలో ఇరాక్ విషయంలోను అమెరికా ఇలాగే వ్యవహరించింది. అయితే ఇరాన్లో అధికారి మార్పిడి అంటే ఖమేనీని అంతమొందించడం కాదని.. ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించి తమకు సానుకూలంగా పనిచేసే వ్యక్తులను ఆ కుర్చీలో కూర్చొబెట్టడమే అని తెలుస్తోంది. పైగా చమురు నిల్వలు పుష్కలంగా ఉండే పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ అత్యంత శక్తివంతమైన దేశం. అణు కేంద్రాల నిర్వహన, యూరేనియం వెలికితీత, చమురు నిల్వల్లో మంచి పట్టు కలిగిన ఇరాన్ రాజకీయపరంగా మాత్రం అంత బలంగా కనిపించదు.
అయితే 1978-79లో ఇరాన్లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం కూడా తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి ఇస్లామిక్ మార్గంలో ఎక్కువగా పయనిస్తూ వచ్చిన ఇరాన్పై అమెరికా సహా చాలా దేశాలు అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తునాయి. పైగా ఇరాన్ సుప్రీం లీడర్గా అయతొల్లా ఖమేనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరాన్ హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిలిటెంట్లకు పరోక్షంగా సాయమందించడం కూడా ప్రస్తుత యుద్ధానికి కారణమైంది.
ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్లోని సురక్షిత బంకర్లో తలదాచుకున్న ఖమేనీకి ఇరాన్లోని అత్యంత రహస్య, ఉన్నతస్థాయి విభాగం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఖమేనీ పాలనలో ఇరాన్ రక్తపాతంలో తడిసి ముద్దవ్వడం తప్ప దేశానికి ఒరిగిందేమి లేదని రెజా పహ్లవి పేర్కొన్నారు.
ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని.. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలన్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ప్రిన్స్ రెజా ఫహ్లావి చేసి వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి.