calender_icon.png 6 June, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనుకు ముందే పత్తి సాగు షురూ..!

04-06-2025 06:08:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అదనుకు ముందే ఈసారి అన్నదాతలు పత్తి సాగుకు శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ఎక్కడ చూసినా పత్తి విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముందస్తుగా కురిసిన వర్షాలతో దుక్కి దున్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కడక్కడ కూసిన వర్షాలతో దుక్కులు విత్తనానికి సిద్ధం చేసి పెట్టారు.

మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో తొలకరికి ముందే రైతులు ఈసారి ముందుగానే పత్తి విత్తనాలను నాటుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ రెండో వారంలో కురిసే వర్షాలను బట్టి సాగుకు సన్నద్ధం అయ్యేవారు. ఈసారి అందుకు భిన్నంగా ముందుగా వర్షాలు కురవడంతో పక్షం రోజులకు ముందే సాగుకు సన్నద్ధం అయ్యారు. విత్తనం నాటేందుకు వాతావరణం అదునుగా ఉండడంతో తొలుత పత్తి విత్తనాలు నాటుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలంలో 84,854 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 

అదును చూసుకొని నాటుకుంటే మేలు

సాధారణంగా జూన్ 2 లేదా మూడో వారం నుండి వర్షాలు కురిసిన ప్రకారం భూమి పదును తరువాత విత్తనం నాటుకుంటే మేలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల(District Agriculture Officer Vijayanirmala) తెలిపారు. అయితే ప్రస్తుతం కూడా పత్తి సాగుకు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉన్నాయని, అయితే విత్తనం నాటిన తర్వాత వర్షాలు ఎక్కువగా కురిసినా, వర్షాలు కురవకపోయినా మొలక శాతం తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. రైతులు దుక్కి దున్నే సమయంలో నేల స్వభావాన్ని గుర్తించి అదునుగా ఉంటే పత్తి విత్తనాలు నాటుకోవచ్చని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పత్తి విస్తీర్ణం సాగుకు 1,13,306 విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసి, ఆ మేరకు కొరత లేకుండా విత్తనాలను డీలర్లు అందుబాటులో ఉంచినట్లు డీఏవో తెలిపారు.