విద్యుత్ అమరవీరులకు సిపిఐ ఘన నివాళి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి,బాలస్వామి లకు సిపిఐ నేరేడుచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ... నాటి పాలకుల దురహoకారానికి, ఆణి ముత్యాల లాంటి ముగ్గురు నవ యువ కిశోరాలు బలయ్యారని వారి ఉసురు తగిలి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, చరిత్రలో ప్రజా ఉద్యమాలు ఎప్పుడు విజయవంతమే అయ్యాయని అధికారoతో కళ్ళు నెత్తికెక్కి, ప్రశ్నించిన ప్రజలను భౌతికంగా మట్టుపెట్టిన వారు కాలగర్భంలో కలిసిపోయారని ఇది చరిత్ర చెబుతున్న సత్యం అన్నారు.
మళ్లీ 2023 సంవత్సరంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కారణ ల పేరిట కొత్త చట్టం తీసుకు వచ్చిందని రైతుల మోటర్లకు మీటర్లు బిగించి రైతులను దోపిడీ చేయాలని ప్రయత్నిస్తున్నదని విద్యుత్తు ప్రైవేటు పరo చేసి రైతాంగం తో పాటు అన్ని వర్గాల ప్రజలపైనా భారం మోపేందుకు చూస్తున్నారని, విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ప్రజా సమస్యలపై పోరాటడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, యువజన నాయకుడు నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.






