పరస్పర మైత్రికి రక్షాబంధన్.. సంప్రదాయ పరిరక్షణకు జంధ్యాధారణ
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): పద్మశాలి సమాజంలో ఐక్యత, పరస్పర మైత్రి, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రక్షాబంధన్, జంధ్యాధారణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంజూర్ నగర్లోని 1000 క్వార్టర్స్లో ఉన్న శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో పద్మశాలి జిల్లా సంఘం, శ్రీ భార్గవ పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్కుమార్ మాట్లాడుతూ... జంధ్యాధారణకు హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఆధునికత పేరుతో మన మూలాలను మరచిపోకుండా ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉంటూ కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భీమనాధుని సత్యనారాయణ, షేర్ కుమారస్వామి, పల్ల రాజేశం, కందగట్ల రవిందర్, నాగుల మహేందర్, కోడూరి సుదాకర్, దాసరి సుదర్శన్, అందేం నర్సింగం, గుండేటి నర్సయ్య, చిప్ప సాయిరాం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






