25-07-2025 08:40:03 PM
ఎస్పి శరత్ చంద్ర పవార్
నిందితులకు శిక్ష పడే విధంగా పని చేయాలి
జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెల వారి నేర సమీక్షా సమావేశంలో జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలు, కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను జిల్లా ఎస్పీ అదికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసిటీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉంటూ,సమర్ధ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పంతో పోలీస్ శాఖ లక్ష్యంగా పనిచేయాలన్నారు.
అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసి కోర్ట్ లో ఛార్జ్ సీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలు, ప్రజలను సమన్వయం చేస్తూ వాటిని అధిగమించేలా ముందుకు సాగాలన్నారు.జిల్లాలో దొంగతనాలు నివారణకు రాత్రి,పగలు పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, పాత నేరస్థుల పై నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సైబర్ నేరాల ఆన్ లైన్ బెట్టింగ్, లోన్ యాప్ ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు అక్రమ గంజాయి,జూదం,పీడీఎస్ బియ్యం,అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.