calender_icon.png 27 July, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇతర పనులకు వాడితే క్రిమినల్ కేసులు

26-07-2025 04:14:24 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు సంయుక్తంగా హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు నల్గొండ జిల్లా , హైదరాబాద్-విజయవాడ రహదారిపై వెలిమినేడ్ వద్ద ఉన్న యాడ్ బ్లూ, డి ఇ ఎఫ్ సేల్ కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డిఇఎఫ్ లో కలుపుతున్న యూరియా ఎలా వస్తుందో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని, అలా కాకుండా ఇతర పనులకు వాడవద్దని, ఇండస్ట్రీలకు ఇండస్ట్రీ యూరియానే వాడాలని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎరువులను ప్రత్యేకించి యూరియాను దారి మళ్లిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను రైతులు మాత్రమే వాడాలని, అలా కాకుండా పరిశ్రమలకు  మళ్లించకూడదని,ఏదైనా పరిశ్రమ సబ్సిడీ యూరియాను వాడితే చట్ట పరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను వాడే అనుమానాస్పద ఇండస్ట్రీలన్నింటిపై పూర్తిస్థాయిలో తనిఖీ చేసి ఇండస్ట్రియల్ యూరియా కాకుండా, సబ్సిడీ యూరియాను వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎరువుల విషయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారని, అంతేకాక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల స్టాకును పరిశీలించారు. రికార్డులన్నిటిని సక్రమంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఎరువులు దుర్వినియోగం కారాదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత సీఈఓ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, చిట్యాల తహసిల్దార్ కృష్ణ,మండల వ్యవసాయ అధికారి గిరిబాబు, తదితరులు ఉన్నారు.