calender_icon.png 2 June, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి మరిచి విమర్శలు చేస్తున్నారు

31-05-2025 05:54:53 PM

నిర్మల్ (విజయక్రాంతి): మాజీమంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభివృద్ధిని మరిచి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసేమ్మ రాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజ్ఞులైన నిర్మల్ నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పునిచ్చి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రిటైర్మెంట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో మంత్రిగా పనిచేసి ప్రజల సొమ్మును బంధువులు, అనుచరులు దోచుకున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రిగా మిగిలిపోయాక కమిషన్లు రాకపోవడంతో ఇష్టారీతిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అయ్యాయని గుర్తు చేశారు. గతంలో ఆయన హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు, తరుగు పేరుతో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 99 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎమ్మెల్యే గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన మాజీ మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

గత వర్షాకాలంలో పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ నీట మునిగితే సాకేర గ్రామ సమీపంలో స్వర్ణా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. అధికారులు ఇటీవల చెక్ డ్యామ్ ఎత్తును తగ్గించారని అన్నారు. దీనిపై ఎలా న్యాయపోరాటం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. పాక్పట్ల గ్రామ శివారులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కమిషన్లు తీసుకుని తక్కువ ధరకు ప్రభుత్వ భూములు అప్పగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని మహేశ్వర్ రెడ్డిపై అవాకులు చివాకులు పేలిస్తే బీజేపీ నాయకులు చూస్తూ ఉండరని రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు అలివేలు మంగ, రాచకొండ సాగర్, ఒడిసెల అర్జున్, ముత్యం రెడ్డి, చంద్రకాంత్, పొన్నం నారాయణ గౌడ్, జమాల్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి, బిట్లింగ్ నవీన్, సత్య నారాయణ, సాయి, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు  సుంకరి రాజేష్, గిల్లి విజయ్, జుట్టు దినేష్, ఈర్ల విజయ్, శ్రావణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.