31-05-2025 05:57:27 PM
కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ సరిత(Additional District Judge S Saritha) పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశానుప్రకారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కోర్ట్ డ్యూటీ పోలీసు వారి చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పొగాకు వాడడంతో రోగాల బారిన పడుతున్నారని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
యువత పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చూడాలని ఈ విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలన్నారు. పొగాకు, సిగరెట్, ఆల్కహాల్ వినియోగం వలన గుండె జబ్బులు, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వస్తుందని , మనిషి బలహీన పడిపోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రాజమల్లు, పీ.పీ పీవీడీ లక్ష్మి, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు, ఏ.వో జె. కిరణ్ కుమార్, న్యాయశాఖ ఉద్యోగులు, కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.