14-06-2025 12:28:44 AM
రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ హైటెక్స్ వేదికగా శనివారం జరగనుంది. సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడంపై విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిన సీఎం రేవంత్రెడ్డి.. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు.
సినిమా రంగ ప్రముఖులను ఏకతాటిపైకి తీసుకురావటం ద్వారా ఈ వేడుకను విజయవంతం చేసేందుకు దిల్ రాజు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ మూవీ అవార్డ్స్ ఆహ్వానపత్రికపై ఆయన పేరే లేకపోవటంపై చాలా మంది నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆహ్వానపత్రిక బయటకు వచ్చినప్పటి నుంచి దానిపై గద్దర్ ఫొటో లేకపోవటంపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురా లు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఈ విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్మీడి యా వేదికగా పోస్ట్ పెట్టారు.
ఉద్దేశపూర్వకంగానే జ్ఞాపికపైన, ఆహ్వానపత్రికపైన గద్దర్ బొమ్మను పెట్టలేదని, గద్దర్ను కాంగ్రెస్ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. కనీసం అవార్డుల ప్రదానోత్సవ సభలోనైనా ఆయన చిత్రపటాన్ని ఉంచాలని కవిత విన్నవించారు. ప్రభుత్వం ఈ అవార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే గద్దర్ పేరుతో స్వీకరించడానికి సినీ జనం అయిష్టంగా ఉన్నారని.. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకొని గద్దర్ బొమ్మ అవార్డు జ్ఞాపికపై లేకుండా రేవంత్ సర్కార్ జాగ్రత్త పడిందని మరికొందరు అంటున్నారు.