23-06-2025 12:00:00 AM
జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
సంగారెడ్డి, జూన్ 22(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 3,28,648 మంది రైతుల ఖాతాలలో రూ.రూ.355.80 కోట్ల నిధులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వానాకాలం - 2025 సీజన్ కు సంబంధించి పంట పెట్టుబడి సాయం క్రింద ప్రభుత్వం జిల్లాలో మొత్తం 3,73,910 మంది రైతులకు రూ.374 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని అన్నారు. ఈనెల 16 న రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 2,18,180 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ.116.32. కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు.
17న మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న74,894 మంది రైతుల ఖాతాలలో రూ.128.65 కోట్ల నిధులు, 18, 19, 20వ తేదీలలో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన 19,805 మంది రైతుల ఖాతాలలో రూ.53.46 కోట్ల నిధులు జమ చేసిందని ఆయన వివరించారు.
21న 6 నుంచి 9 ఎకరాల లోపు సాగు భూమి కలిగిన 15,769 మంది రైతుల ఖాతాలలో రూ.57.37 కోట్ల నిధులు జమ చేసిందని వివరించారు. ఆరు రోజుల వ్యవధిలోనే మొత్తంగా జిల్లాలో 3,28,648 మంది రైతుల ఖాతాలలో రూ.355.80 కోట్ల నిధులు జమ అయ్యాయని డీఏవో శివప్రాసాద్తెలిపారు.