17-02-2026 01:40:07 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): క్రిప్టో కరెన్సీ మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా కేవైసీ వెరిఫికేషన్ పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి, ఒక వ్యక్తి క్రిప్టో వాలెట్ నుంచి ఏకంగా 21 లక్షల టెథర్ కాయిన్స్ - భారత కరెన్సీలో సుమారు రూ. 17 కోట్లకు పైమాట మాయం చేసిన భారీ మోసం హైదరాబాద్లో వెలు గు చూసింది. ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.
సాంకే తిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి, ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని కళ్యాణ్ నగర్కు చెందిన ఒక వ్యక్తి క్రిప్టో ట్రేడింగ్ చేస్తుంటారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ని సంప్రదించి, తాము క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తామని నమ్మించారు. అయితే, ఈ లావాదేవీ జరగాలంటే ముందుగా మీ ట్రాన్ వాలెట్ అడ్రస్కు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని షరతు పెట్టారు.
ఇందుకోసం ట్రాన్ టగ్. అర్గ్ అనే వెబ్సైట్ లింక్ను పంపించారు. అది నిజమైన వెబ్సైట్ అని నమ్మిన బాధితుడు, ఆ లింక్ ఓపెన్ చేసి తన వివరాలను నింపారు. బాధితుడికి తెలియకుండానే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఎనేబుల్ అయ్యింది. క్షణాల్లో బాధితుడి వాలెట్లో ఉన్న 21,04,089 యుస్ టీడీ సుమారు రూ. 17 కోట్లకు పైగా నిందితుల వాలెట్లోకి బదిలీ అయిపోయాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎస్. నరేష్ నేతత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది.కాగా సుషిమ్ శ్రీపతి గైక్వాడ్ పూణే, మహారాష్ట్ర.. ఈ నేరంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీకాంత్ హైదరాబాద్.. బాధితుడిని నేరుగా సంప్రదించి, క్రిప్టో కొంటామని నమ్మించాడు.
లక్కీ చౌదరి జైపూర్, రాజస్థాన్.. ఇతను వెబ్ డిజైనర్. నకిలీ కేవైసీ వెబ్సైట్ ను రూపొందించి, అది అసలైనదానిలా కనిపించేలా చేసి మోసానికి తెరలేపాడు.ఈ ముఠా దేశవ్యాప్తంగా ఇదే తరహాలో అనేక మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ
క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ అరవింద్ బాబు సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేసి వాలెట్లను కనెక్ట్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలిన నకిలీ సైట్లను సష్టిస్తున్నారని,జాగ్రత్తగా గమనించాలని కోరారు. ఎల్లప్పుడూ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలని, ఏదైనా అనుమానం వస్తే లేదా మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.