12-04-2025 12:43:01 AM
గద్వాల, ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ) : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు,తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన రోగ నిర్ధారణకు ఉపయోగపడే సి.టి స్కాన్ సదుపాయాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హస్పిటల్ నందు రేడియాలజీ ల్యాబ్ లోని రూ 2.5 కోట్ల రూపాయల విలువైన సి.టీ స్కాన్ ను గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను అందించడానికి అత్యాధునిక కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రోగులకు నాణ్యమైన, ఖచ్చితమైన రోగనిర్ణయ సేవలు అందించవచ్చని, సూక్ష్మమైన లోపాలను కూడా ఇది గుర్తించగలదని తెలిపారు.
దీని ద్వారా రోగులకు తగిన వైద్య చికిత్సలు వేగంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో CT స్కాన్ పరీక్షల కోసం ప్రజలు ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అదే సౌకర్యం స్థానికంగా లభించడంతో ప్రజలు సమయం, ఖర్చును ఆదా చేసుకోవచ్చన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో ఈ సేవలు లభించడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, ఆసుపత్రి సూపరిడెంట్ ఇందిర, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.