31-05-2025 05:30:05 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వాన కాలంలో పంట పొలాల్లో సేంద్రియ సాగుకు అనుకూలంగా ఉండే విధంగా సాగు చేసే జీలుగ విత్తన ధరను ప్రభుత్వం రెట్టింపు చేసిందని, వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మారుతినేని పాపారావు(CPM District Committee Member Maruthineni Paparao) డిమాండ్ చేశారు. కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఏల్పుగొండ సావిత్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ... రైతులకు మేలైన విత్తనాలను, తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలతో ప్రతి ఏటా వందల మంది రైతులు నష్టపోతున్నారని, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గ విధంగా సాగుకు అవసరమైన ఇన్పుట్ సబ్సిడీలను అందజేయాలని కోరారు. రైతుల నుంచి సేకరించిన సన్నధాన్యానికి కింటాకు 500 బోనస్, రైతుల ఖాతాల్లో జాప్యం చేయకుండా వెంటనే జమ చేయాలని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం రైతు భరోసా సాయం అందించాలన్నారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు. కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, అదనంగా 50 శాతం మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న, మోడం వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి. జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.