14-04-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 13 ( విజయకాంత్ ) : కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందని మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన రెముడాల గట్టయ్య (48) కుమార్తె డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అదే పట్టణానికి చెందిన వేరే కులం యువకుడిని ప్రేమించింది.
కుటుంబ సభ్యులకు తెలియకుండా గత నెల 8న వివాహం చేసుకుంది. దీనిపై గట్టయ్య తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గట్టయ్య కుమార్తె వివాహం చేసుకుని జిల్లా ఎస్పీ దగ్గర సరెండర్ అయిన విషయం తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కలిసేందుకు ఆమె ఇష్టపడటం లేదని గట్టయ్యకు చెప్పారు.
దీంతో మనస్తాపానికి గురైన గట్టయ్య 10న ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్కట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. తండ్రి మృతి వార్తను బంధువులు ఫోన్ ద్వారా కుమార్తెకు తెలియజేసి చివరి చూపు కోసం రావాలని కోరినా, ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు.