14-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ పాలనలోవ్యాపారాలు దెబ్బతిన్నాయి
జాకీలు పెట్టి లేపిన కాంగ్రెస్ పార్టీ లేవలేని పరిస్థితి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శ
గజ్వేల్, ఏప్రిల్ 13 : రాష్ర్ట ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో 40 శాతం నూకలే ఉన్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం స్థాయి బి ఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ చ్చాక వ్యాపారాలన్నీ కుంటుబడిపోయాయ ని, ఇంతటి దుస్థితి గతంలో ఏనాడు లేదని చెప్పారు. చెట్లు పెంచడం కేసీఆర్ వంతు అయితే చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు అయిందన్నారు.
యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని, బి ఆర్ ఎస్ పాలనలో ఇండ్లు షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూలేట్ బోర్డులు కనబడుతున్నాయని, దేవుడి పై ఒట్టు పెట్టి దేవున్నీ మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈ పాపానికి కారణం అని విమర్శించారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, జాకీలు పెట్టి లేపిన లేచే పరిస్థితి లేదని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 సంవత్సరాల సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్ష మంది హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.