23-06-2025 10:07:53 PM
మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన డీసీపీ ఎన్. కోటిరెడ్డి..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్ఓటి, దుండిగల్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి(DCP Koti Reddy) నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా హర్యానా రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర తనిఖీలు నిర్వహించామన్నారు.
సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో AP 40 DM 8365 నెంబర్ గల టాటా నెక్సన్ కారులో నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా, సేవాలాల్ మందిర్ ప్రాంతానికి చెందిన సాగర్ పవార్(23) ని అరెస్ట్ చేశారు. నిందితున్ని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపాడు. సెల్ నంబర్లు మారుస్తూ, గంజాయిని ఒక వాహనం నుండి మరో వాహనానికి మారుస్తూ తరలిస్తున్నట్లు తెలిపాడు. 45 లక్షల విలువచేసే 120.17 కిలోల గంజాయి,టాటా నెక్సా వాహనం, 5 సెల్ ఫోన్ లు సీజ్ చేశామని తెలిపారు. మరో నలుగురు నిందితులు దేవరాజ్, భజరంగ్, హనుమంతు పవార్, రాజకుమార్ లు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఎంతో చాకక్యంగా వ్యవహరించిన ఎస్ఓటి, దుండిగల్ పోలీసులను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.