ఆ జాబితాలో దీపికా పేరు!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కొద్దిరోజుల క్రితమే అరుదైన ఘనత సాధించిన దీపికా.. ఇప్పుడు మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవలే ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపిక కావటం ద్వారా ఆ అరుదైన గౌరవం దక్కిన తొలి భారతీయురాలిగా చరిత్రలో స్థానం పదిలపర్చుకున్నారు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ ప్రతిభావంతమైన మహిళల జాబితాను ప్రకటించగా, అందులో దీపికాకు చోటు దక్కింది.
ఇంకా ఈ జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్తోటు హాలీవుడ్ నటీమణులు ఏంజెలినా జోలీ, సెలినా గోమెజ్ వంటి ప్రముఖులున్నారు. వీళ్లలోని సృజనాత్మకత, క్రియాశీలత, నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ లిస్టు రూపొందించారు.
2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు 100 మంది’ (మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్) జాబితాలో దీపికా చోటు దక్కించుకున్నారు. 2022లో ఫుట్బాల్ వరల్డ్కప్ను ఆవిష్కరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దీపికా ప్రస్తుతం అల్లు అర్జున్ కాంబో చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే.






