మాడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం
- సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్లు వాడితే కేసుల నమోదు..
ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరిక
అదిలాబాద్, మే 27 ( విజయ క్రాంతి ) :డుడ్... డుడ్... డుడ్.... డుడ్.... పట్ ... పట్... పట్... పట్... అంటూ భారీ శబ్దాలు చేసే ద్విచక్ర వాహనాదారులపై ఇక నుండి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సౌండ్ పొల్యూషన్కు కారణమైన అధిక శబ్దంతో వెళ్తున్న ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ పోలీసులు కొరడా ఝూలిపించారు.
ఇటీవ ల స్పెషల్ డ్రైవ్ చేపట్టి బుల్లెట్, ఇతర ద్విచక్ర వాహనాలకు బిగించిన మాడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ట్రిఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట మారు 160 మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బుల్లెట్ వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టిన వారిపై ఇక నుండి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సైలెన్సర్లను బిగించిన మెకానికల్ పై సైతం కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులకు, చిన్నపిల్లలకు భారీ శబ్దంతో గుండె సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. యువత ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించకూడదని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, సీఐ లు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, ఎస్.ఐ మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.






