వికలాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచాలి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ చౌక్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇస్లాంబిన్ హసన్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో 2007లో విహెచ్పిఎస్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పట్లో వికలాంగుల పెన్షన్ కేవలం రూ.200 ఉండగా, మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితంగా ప్రస్తుతం రూ.4,016కు పెరిగిందన్నారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.2,016కు చేరిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను రూ.6 వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు పెన్షన్లు పెంచలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి వెంటనే చేయూత పెన్షన్లను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ నాయకులు భూరం శ్రీనివాస్, కుటికల రాజయ్య, మనోహర్, సోమయ్య, ఎం ఆర్ పి ఎస్ నాయకులు మాటూరి జయరాజ్, కాంపల్లి రాజాలింగో తదితరులు పాల్గొన్నారు.






