దివ్యాంగులు సదరం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగులు సదరం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని కలెక్టర్ కె. హరిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చే దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ... దివ్యాంగులకు త్రాగునీరు, వీల్ చైర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు తప్పనిసరిగా సదరం శిబిరానికి వచ్చేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సదరం శిబిరాల్లో కంటి చూపు లోపం, మానసిక వైకల్యం, రక్త సంబంధిత వ్యాధులు, సికిల్ సెల్, తలసేమియా, హీమోఫీలియా, మూగ-చెవిటి, ఎముకల సంబంధిత వైకల్యాలు తదితర సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.




