ధైర్యంతో వైకల్యాన్ని జయించాలి
దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ
ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం
ఆర్మూర్, జూన్ 18 (విజయక్రాంతి): దివ్యాంగ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో తమలోని వైకల్యాన్ని జయించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సహాయ ఉపకరణాలను ఉపయోగించుకొనే విధానాన్ని తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దివ్యాంగ విద్యార్థుల కోసం భవిత కేంద్రంలో అందిస్తున్న సేవలను వివరించారు. తమలోని వైకల్యంతో నిరాశ చెందకుండా ధైర్యంగా వైకల్యాన్ని జయించాలన్నారు. అనంతరం సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం, ఆర్టిఫిషియల్ లింబ్స్ మానిఫాక్చరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సంయుక్తంగా మంజూరు చేసిన వీల్ చైర్స్, ట్రై సైకిల్, రోలేటర్లు, సీపీ చైర్, టీఎల్ఎం, హియరింగ్ ఎయిడ్స్ను దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేసారు.
ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరం
ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యురాలు అరుణ మాట్లాడుతూ ప్రతీ మంగళ, గురువారాల్లో సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు ఫిజియోథెరపీ చికిత్సను అందించారు. ఈ శిబిరంలో ఇన్ క్లూసివ్ ఎడ్యుకేహాన్ రిసోర్స్ పర్సన్స్ కిషన్, సురేష్ , ఆపరేటర్ రఘు, మెసెంజర్ రవి, సీజీవీ కవిత, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






