సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ
అందుబాటులో అన్ని రకాల పత్తి విత్తనాలు
రైతునేస్తంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పటివరకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అదనపు విత్తనాలు కూడా తెప్పించి అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో అధిక సాంద్రత, పత్తి సాగు, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఇంకా రాష్ట్రంలో అవసరమైన మేరకు పత్తి విత్తనాలు ఉన్నాయని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకే రకమైన దిగుబడి ఇస్తామని, నిర్ధిష్ట రకం కోసం డిమాండ్ చేయవద్దని రైతులకు సూచించారు.
రాష్ట్రంలో రైతులు సేంద్రియ వ్యవసాయ విధానం సక్రమంగా అనుసరించి పంటలు పండిస్తే ఎగుమతులకు అవకాశం ఏర్పడి పంటలకు గిట్టుబాటు ధరల వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ యడవల్లి వెంకటేశ్వర్రావు, చింతల వెంకట్రెడ్డి సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించి, ప్రజల శ్రేయస్సు కోసం సేంద్రియ వ్యవసాయ విధానం అనుసరించాలని రైతులను అభ్యర్థించారు. వ్యవసాయ సంచాలకుడు గోపి మాట్లాడుతూ రెండో విడుతలో మండలానికి ఒకటి చొప్పున మరో 456 దృశ్య శ్రావణ పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకుడు రఘరామ్రెడ్డి, పత్తి శాస్త్రవేత్త ప్రశాంత్ పాల్గొన్నారు.






